పోలవరంకు త్వరలోనే నిధులు కేంద్రం హామీ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు అనిల్ కుమార్ యాదవ

 



 


  • కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిసిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖామాత్యులు అనిల్ కుమార్ యాదవ్.


 


న్యూ ఢిల్లీ,  : దేశ రాజధాని ఢిల్లీ కి ఒక రోజు పర్యటన నిమిత్తమై వచ్చిన  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల & నీటివనరుల అభివృద్ధి శాఖామాత్యులు అనిల్ కుమార్ యాదవ్   కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను కలిశారు.  మంత్రితో పాటు  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాద్ దాస్,  పార్లమెంటు సభ్యులు మిథున్ రెడ్డి, గోరంట్ల మాధవ్,  లావు కృష్ణదేవరాయలు సమావేశంలో పాల్గొన్నారు.   

కేంద్ర మంత్రితో జరిగిన సమావేశంలో పోలవరం ప్రాజెక్ట్ కు సంబందించిన బకాయిలు, పునరావాసం  ప్యాకేజీ నిధుల,  పోలవరం ప్రాజెక్టు రీయింబర్స్మెంట్ నిధులు   త్వరితగతిన  విడుదల చేయాలని కోరినట్లు ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి తెలిపారు.  కృష్ణ ప్రాజెక్టుల వల్ల రాయలసీమకు జరిగే ప్రయోజనాలను గురించి కూడా  వివరించినట్లు తెలిపారు.    రాష్ట్రంలో చేపట్టబోతున్న ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందించాలని కోరామని , దానికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు.  రాష్ట్రానికి అన్ని విధాలా కేంద్ర సహకారం ఉంటుందని ముఖ్యమంత్రి కి చెప్పమని కేంద్రమంత్రి అన్నట్లు రాష్ట్ర మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విలేఖరులకు చెప్పారు.  కరోన నేపథ్యంలో కొంత ఆలస్యమైందని, త్వరలోనే నిధులు విడుదల చేస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. వరదల సమయంలో నూ పోలవరం ప్రాజెక్టు పనులను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్నారని, 2021 డిసెంబర్ నాటికల్లా పోలవరం  పూర్తి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి లక్ష్యమని  గజేంద్ర సింగ్ షెకావత్ కు విన్నవించినట్లు విలేఖరులకు రాష్ట్ర మంత్రి తెలిపారు.  ఆర్ అండ్ ఆర్ పనులు వేగంగా జరుగుతున్నాయని, కేంద్రం నుంచి త్వరితగతిన నిధులు వస్తే ఆ పనులు మరింత వేగంగా పూర్తవుతాయని కేంద్ర జల్ శక్తి మంత్రికి వివరించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.  నాలుగు వేల కోట్ల రూపాయల పోలవరం బకాయిలు  త్వరలోనే విడుదల చేస్తామని కేంద్రమంత్రి తెలిపారని చెప్పారు.  అపెక్స్  కౌన్సిల్ సమావేశం తేదీ త్వరలోనే నిర్ణయిస్తామని కేంద్ర మంత్రి చెప్పినట్లు, ఈ అంశాలను సానుకూలంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు.  కరోన కారణంగా అఫెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా పడింది.  ఎప్పుడు మీటింగ్ జరిగినా రాష్ట్ర వాదనను ముఖ్యమంత్రి బలంగా వినిపిస్తారని తెలిపారు.