ఊటగెడ్డ వార్డు సచివాలయాo ఆకస్మిక తనిఖీ : సంయుక్త కలెక్టరు వేణుగోపాల్ రెడ్డి

 



విశాఖపట్నం, :   విధినిర్వహణలో అలక్ష్యం ప్రదర్శించినా, పనితీరును మెరుగుపరుచుకోకపోయినా  కఠిన చర్యలు తీసుకోవలసి వస్తుందని  సంయుక్త కలెక్టరు     ఎం. వేణుగోపాల్ రెడ్డి అన్నారు.  నగరంలోని  ఊటగెడ్డ వార్డు సచివాలయాన్ని ఆయన   ఆకస్మిక తనిఖీ చేసారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ఆయన  ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అన్ని అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడానికి చిత్తశుద్దితో పనిచేయాలని సిబ్బందిని కోరారు.  ప్రభుత్వ నియమ నిబంధనల మేరకు రికార్డులను సవ్యంగా నిర్వహించాలని కోరారు.  పంపిణీ చేయకుండా మిగిలిఉన్న   15 రేషను కార్డులను  వాలంటీర్లకు యిచ్చి  సత్వరమే పంపిణీచేయాలని తెలిపారు. రిజిస్టర్లను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయకుండా  సరిగ్గా సమాదానాలు యివ్వలేకపోయిన  అడ్మినిస్ట్రేటర్ ను తీవ్రంగా మందలించారు.   పనితీరును మెరుగుపరచుకోకపోతే  తదుపరి పరిపాలనా చర్యలను తీసుకోవలసి వస్తుందని హెచ్చరించారు. అనుమతి లేకుండా గైరుహాజరైన  వి.ఆర్.ఒ. వి.సూర్యప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని, హాజరు పట్టికను సక్రమంగా నిర్వహించాలని తెలిపారు.  అదే భవనంలో ఉన్న యితర సచివాలయాల సిబ్బందిని కూడా బాద్యతాయుతంగా పనిచేసి  ప్రజలకు  మెరుగైన సేవలను అందించాలని సూచించారు.   ఈ కార్యక్రమంలో  మహరాణిపేట మండల తహశీల్దారు అప్పలరాజు, ఇతర అధికారులు పాల్గొన్నారు.